ఇక ఓఆర్ఆర్ గ్రామాల‌కు రోజు విడిచి రోజు నీటి స‌ర‌ఫ‌రా

· మంత్రి కేటీఆర్ ఆదేశాల మేర‌కు అద‌నంగా 50 ఎంఎల్డీల కేటాయింపు.

· 56 వేల‌కు పైగా కుటుంబాల‌కు తీర‌నున్న ఇక్క‌ట్లు.

· స‌మీక్ష స‌మావేశంలో జ‌ల‌మండ‌లి ఎండీ దాన కిశోర్ వెల్ల‌డి

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): మున్సిపల్ మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ వెలుపల ఉన్న ఓఆర్ఆర్ గ్రామాల‌కు (మున్సిపల్ కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయితీ లకు) ఇప్ప‌టికే స‌ర‌ఫ‌రా చేస్తున్న నీటి కంటే అద‌నంగా 50 ఎంఎల్డీల నీటిని కేటాయిస్తున్న‌ట్లు జలమండలి ఎండీ ఎం. దాన కిషోర్ లిపారు. ఈ మేరకు గురువారం ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఓఆర్ఆర్ ఓ అండ్ ఎం, ట్రాన్స్మిషన్ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జ‌ల‌మండ‌లి ప‌రిధిలోని జీహెచ్ఎంసీ వెలుపల, ఓఆర్ఆర్ లోపల మొత్తం 7 మున్సిపల్ కార్పొరేషన్ లు, 18 మున్సిపాలిటీలు, 17 గ్రామ పంచాయితీల్లో మొత్తం 193 గ్రామాలు ఉన్నాయని, ప్రస్తుతం వీటిల్లో కొన్ని ప్రాంతాలకు రోజు విడిచి రోజు, మరి కొన్ని ప్రాంతాల్లో మూడు నుండి 5 రోజులకొకసారి నీటి సరఫరా జరుగుతుందని… దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని, ఈ సమస్యను తీర్చడానికి ఆయా ప్రాంతాలకు రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. దానికనుగుణంగా ఈ ప్రాంతాల‌కు ఇప్ప‌టికే స‌ర‌ఫ‌రా చేస్తున్న నీటి కంటే, 50 ఎమ్మెల్డి ల నీటిని అద‌నంగా స‌ర‌ఫ‌రా చేయనున్న‌ట్లు ఎండీ తెలిపారు. దీనివ‌ల్ల‌ ఆయా ప్రాంతాలలో నివ‌సిస్తున్న‌ 56 వేల‌కు పైగా కుటుంబాలు లబ్ది పొందనున్నట్లు ఆయన వివరించారు. రేపటినుండే ఈ సరఫరాను ప్రారంభించాలని.. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. దీని కోసం ఆయా ప్రాంతాల్లో మంచినీటి స‌ర‌ఫ‌రాను మెరుగుపర్చ‌డానికి కొత్త పైప్ లైన్ నిర్మాణం, మరికొన్ని ప్రాంతాల్లో ఫీడర్ మెయిన్ లు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు ఆయన వెల్లడించారు.

ఈ స‌మావేశంలో డైరెక్ట‌ర్ ఆప‌రేష‌న్స్- 2 ఎం. స్వామి, రెవెన్యూ డైరెక్ట‌ర్ వి.ఎల్. ప్ర‌వీణ్ కుమార్, ఓఆర్ఆర్ ఓ అండ్ ఎం, ట్రాన్స్మిషన్ సీజీఎంలు, జీఎమ్ లు , డీజీఎంలు , మేనేజ‌ర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.