కరోనా విలయం.. కేంద్రంపై సుప్రీం ఆగ్రహం
కరోనా నియంత్రణపై సుమోటోగా విచారణ.. కేంద్రానికి నోటీసులు జారీ

న్యూఢిల్లీ: “దేశంలో పరిస్థితి అల్లకల్లోలంగా మారుతోంది. నేషనల్ ఎమర్జెన్సీ తరహా పరిస్థితులను ఎదర్కొంటోంది“ అని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణ అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు గురువారం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం మనం జాతీయ అత్యవసర పరిస్థితిలో ఉన్నామని ప్రధాన న్యామయూర్తి బాబ్డే నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. రేపటిలోగా కరోనాకు సంబంధించిన జాతీయ విధానం రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే ఈ అంశంలో కోర్టుకు సలహాలు అందించేందుకు ప్రముఖ న్యాయవాది జస్టిస్ హరీష్ సాల్వేను అమికస్ క్యూరీగా నియమించింది. దీని పై శుక్రవారం విచారణ జరుపనున్నట్లు వెల్లడించింది.
ఆక్సిజన్, మందులు, వ్యాక్సినేషన్ వంటి కరోనా అత్యవసరాల సరాఫరాపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కరోనా కట్టడికి సంసిద్ధత ప్రణాళిక సమర్పించాలని ఆదేశించింది.
ఇక నాలుగు అంశాలపై సమాధానాలు అడిగింది. ఆక్సిజన్ సరఫరా, అత్యవసర మందుల సరఫరా, వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న తీరుతోపాటు లాక్డౌన్లు విధించుకునే అధికారం రాష్ట్రాలకు వదిలేయాలన్న అంశాలపై సుప్రీంకోర్టు కేంద్రం అభిప్రాయాలను కోరింది. కొవిడ్ నియంత్రణపై ప్రస్తుతం 6 హైకోర్టుల్లో విచారణలు కొనసాగుతున్నాయి. అయితే దీనివల్ల గందరగోళం ఏర్పడుతున్న నేపథ్యంలో తాము విచారణకు సిద్ధమైనట్లు ధర్మాసనం పేర్కొంది.