తప్పుడు ప్రచారంతో మోసం చేస్తోన్న బిజెపి: మంత్రి దయాకర్ రావు

వరంగల్: తప్పుడు ప్రచారంతో తెలంగాణ ప్రజలను భారతీయ జనతాపార్టీ మోసం చేస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. సోమవారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి వరంగల్లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో ఈ సమావేశంలో ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, గండ్ర వెంకట రమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. దుబ్బాకలో తప్పుడు ప్రచారం చేసి, ఓ కార్యకర్తను బలి చేసి బీజేపీ గెలిచిందని అన్నారు. బీజేపీ నలుగురు ఎంపీలు ఏం చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వర్షాలతో రాష్ట్రం అల్లకల్లోలమైనా కేంద్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. హైదరాబాద్, వరంగల్ నగరాలు నీట మునిగితే బాధితులను ఆదుకునేందుకు నయా పైసా ఇవ్వలేదన్నారు. కార్పొరేట్ శక్తుల చేతుల్లో కీలుబొమ్మగా మారిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైల్వేతో సహా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదని మంత్రి ఆక్షేపించారు.
అనంతరం మంత్రి సత్య వతి రాథోడ్ మాట్లాడుతూ.. బీజేపీ నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. అబద్ధాలను పదేపదే చెబితే నిజాలైపోవన్నారు. సన్న ధాన్యానికి మద్దతు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మంత్రి విమర్శించారు.