తెలంగాణ పత్తికి బ్రాండ్ ఇమేజ్ తేవాలి: కేసీఆర్

హైదరాబాద్: అత్యంత నాణ్యతతో కూడిన పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్ వచ్చేలా బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణపై మంత్రి నిరంజన్రెడ్డి, ఉన్నతాధికారులతో సీంఎ సమీక్ష నిర్వహించారు. పత్తి సాగు, మార్కెటింగ్పై ఆయన పలు సూచనలు చేశారు.
తెలంగాణ పత్తికున్న విశిష్ట లక్షణాలను గుర్తించి, వాటిని ప్రచారం చేయడానికి అవసరమైన వ్యూహం రూపొందించాలని కోరారు కేసీఆర్.. దీనికోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిపుణులతో ఓ సదస్సు నిర్వహించాలని చెప్పారు. తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా మరింత డిమాండ్ రావడానికి అనుగుణంగా పత్తి ఏరిన తర్వాత శుద్ధి చేయడం, ప్యాక్ చేయడం లాంటి పనులను జాగ్రత్తగా నిర్వహించే విషయంలో రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని కోరారు.
ఇక, దేశంలో ఎక్కువ విస్తీర్ణంలో పత్తిని సాగు చేస్తున్న రెండో రాష్ట్రం తెలంగాణ. తెలంగాణలో 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతున్నది. పత్తికి దేశీయంగా, అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉంది. తెలంగాణ పత్తి పింజ పొడవు ఎక్కువ కాబట్టి మరింత డిమాండ్ ఉంది. ఇరిగేటెడ్ వాటర్ (సాగునీరు) ద్వారా సాగు చేసే భూముల్లో పంట మరింత బాగా వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు ఎక్కువ కట్టుకున్నందున సాగునీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. కాబట్టి కాల్వల కింద పత్తిని సాగు చేస్తే మరింత లాభసాటిగా ఉంటుందన్నారు సీఎం కేసీఆర్.. పత్తికి మంచి మార్కెట్ రావడానికి ప్రభుత్వం కూడా అవసరమైన చర్యలు తీసుకున్నది.. తెలంగాణ ఏర్పడక ముందు జిన్నింగ్ మిల్లుల సంఖ్య కేవలం 60 మాత్రమే ఉంటే, వాటిని 300 కు పెంచేలా చర్యలు తీసుకున్నది. పత్తి పంట ఎక్కువ పండే ప్రాంతాల్లో జిన్నింగ్ మిల్లులు నెలకొల్పేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసిందన్నారు. రైతులు లాభసాటి పంటలనే పండించే విధంగా తెలంగాణ రాష్ట్రంలో చర్యలు ప్రారంభించాం. రైతులు కూడా ప్రభుత్వ సూచనలు పాటించి నియంత్రిత పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఇది మంచి సంప్రదాయం. మార్కెట్లో పత్తికి, నూనె గింజలకు, పప్పులకు మంచి డిమాండ్ ఉంది. కూరగాయలకు కూడా మంచి ధర వస్తుంది. వాటిని ఎక్కువగా పండించాలి. కందుల విస్తీర్ణం 20 లక్షలకు పెంచాలి. ఆయల్ పామ్ విస్తీర్ణం 8 లక్షలకు పెరగాలి సీఎం అన్నారు.