పేదల ఆత్మ గౌరవానికి ప్రతీకలు డబుల్ ఇళ్ళు
రూ. 5 కోట్లతో నిర్మించిన 80 డబుల్ బెడ్ రూం ఇళ్ళను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ఖమ్మంః పేద ప్రజలు ఆత్మ గౌరవంతో జీవించాలన్న ఉద్దేశ్యంతో పైసా ఖర్చులేకుండా ఇండ్లు లేని నిరుపేదలకు అన్ని సదుపాయాలతో డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రభుత్వం అందజేస్తుందనీ, డబుల్ ఇల్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని సింగరేణి మండలం గాంధీ నగర్ గ్రామంలో రూ.1.25 కోట్లతో నిర్మించిన 20 డబుల్ బెడ్ రూం ఇల్లు, చీమలవారిగూడెం గ్రామంలో రూ. 1.25 కోట్లతో 20 కొత్తతండాలో రూ.1.25 కోట్లతో 20 ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాదపాలెం మండలం చింతగుర్తి గ్రామంలో రూ.1.25 కోట్లతో 20 డబుల్ బెడ్ రూం ఇండ్లను మొత్తం రూ.5 కోట్లతో 80 డబుల్ బెడ్ రూం ఇండ్లను ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో మంత్రి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని అందుకే భారీ వ్యయంతో కూడుకున్నప్పటికి రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంకు శ్రీకారం చుట్టారని అన్నారు
పేదలకు కేటాయించిన ఇండ్లు ఒక్కొక్కటి స్థలంలో కలిపి దాదాపు 15 లక్షల విలువైనవి తెలిపారు. ఇండ్ల కేటాయింపు పూర్తి పారదర్శకంగా చేపట్టామన్నారు. ప్రజల సమక్షంలో నిజమైన నిరుపేదలను లబ్దిదారులుగా ఎంపిక చేశామని మంత్రి తెలిపారు. ఎస్సీలు, బిసి లు, ఎస్టీలు, ముస్లిం మైనారిటీ లకు ఇండ్లు కేటాయించామన్నారు.
జిల్లాలో ఇప్పటివరకు 750కు పైగా రెండు పడక గదుల ఇండ్లను నిరుపేదలకు అందజేశామన్నారు. ఒక్క రూపాయి లంచం లేకుండా గృహ ప్రవేశాలు చేయించామన్నారు.
అధిక వ్యయం అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం, వారి ఆత్మగౌరవం కాపాడేందుకు రెండు పడక గదుల ఇళ్లను కేటాయించిందని, వాటిని సద్వినియోగం చేసుకుని పేద ప్రజలు అన్ని విధాలుగా అభివృద్ధి సాధించాలన్నారు తమ కాళ్ళ మీద తాము నిలబడి ఆత్మగౌరవం తో బ్రతకాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల సమిష్టి కృషి వల్లే నేడు పేదలకు ఇళ్ళు కేటాయించుకోగలిగామని చెప్పారు.చీమలవారిగూడెంలో 20 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కోసం ఎకరం స్థలం ఇచ్చిన చీమల లక్ష్మీని మంత్రి పువ్వాడ శాలువ కప్పి సత్కరించారు. స్థలం ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు అభినందించారు.కోవిడ్ అనివార్య పరిస్థితుల వల్ల ఇళ్లను అందజేయడం కొంత ఆలస్యం అయినప్పటికీ, డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. లబ్ధిదారుల తో కలిసి ఇండ్ల ప్రవేశం చేయడం, పాలు పొంగించడం పట్ల ఆనందంగా ఉందన్నారు. నిర్మాణాలు పూర్తి అయిన వాటికి లబ్ధిదారులను ఎంపికచేసి అందజేస్తామని, నిర్మాణంలో ఉన్న మిగతా గ్రామాల్లో ఇండ్లను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పని చేస్తుందని, ప్రజలు కూడా పని చేసే ప్రభుత్వాలకు అండగా నిలవాలి కోరారు. రైతులు పండించిన ధాన్యం ను పూర్తిగా కొనుగోలు చేసి రైతులకు వారి ఖాతాలో నగదును జమ చేశామన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాల ప్రజలకు అన్ని అందుబాటులో ఉంచామని, వ్యవసాయం కోసం విత్తనాలు, ఎరువులు, సాగునీరు ఉంచామన్నారు. సంక్షేమ పథకాలు ఆగకుండా నిధులు విడుదల చేస్తూ గ్రామాల అభివృద్ధికి అన్ని విధాలుగా పూర్తి సహకారం అందించామన్నారు. ఈ కార్యక్రమంలో వైరా శాసన సభ్యులు లావుడ్యా రాములు నాయక్, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ కూరకుల నాగభూషణం, ఎంపీపీ శకుంతల, పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.