సిజెఐగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం

న్యూఢిల్లీ (CLiC2NEWS): భారత అత్యున్నత న్యాయస్థానం 48వ ప్రదాన న్యాయమూర్తిగా తెలుగు నేలకు చెందిన జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ (శనివారం) ఉదయం రాష్ట్రపతి భవన్లో ఆయన చేత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమానికి కొద్ది సంఖ్యలోనే అతిథులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్రమంత్రులు, న్యాయశాఖ ఉన్నతాధికారులతో పాటు జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఇక,1957, ఆగస్ట్ 27న జన్మించిన జస్టీస్ ఎన్వీ రమణ పదవీ కాలం 2022, ఆగస్ట్ 26తో ముగియనుంది.

జస్టిస్ నూతలపాటి వెంకటరమణ స్వస్థలం కృష్ణాజిల్లా వీరులపాడు మండలం పొన్నవరం. 1983లో న్యాయవాద వృత్తిని ప్రారంభించి జస్టిస్ రమణ.. అంచెలంచెలుగా ఎదుగుతూ దేశ అత్యున్నత స్థానానికి చేరుకున్నారు.
బాల్యము
ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా లోని పొన్నవరం గ్రామంలో 1957 ఆగస్టు 27 న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. గణపతిరావు, సరోజిని ఆయన తల్లిదండ్రులు. ఆయన కంచికర్లలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తిచేసి, అమరావతి లోని ఆర్.వి.వి.ఎన్.కాలేజీలో బి.యస్సీలో పట్టా పొందారు. 1982 లో నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా తీసుకొని 1983 ఫిబ్రవరి 10 న రాష్ట్ర బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా నమోదై న్యాయవాదిగా వృత్తి ప్రారంభించారు.
న్యాయ వృత్తి
1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. హైకోర్టుతో పాటు కేంద్ర, రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునళ్లలో ప్రాక్టీస్ చేశారు. సుప్రీంకోర్టులో కూడా కేసులు వాదించారు. రాజ్యాంగపరమైన, క్రిమినల్, సర్వీస్, అంతర్రాష్ట్ర నదీ జలాల సంబంధిత కేసుల వాదన ఆయన ప్రత్యేకత. పలు ప్రభుత్వ సంస్థలకు ప్యానల్ అడ్వకేట్గా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. అదనపు అడ్వకేట్ జనరల్గానూ బాధ్యతలు నిర్వర్తించారు. 2000 జూన్ 27న హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దేశ, విదేశాల్లో జరిగిన పలు న్యాయసదస్సుల్లో జస్టిస్ రమణ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ ప్రెసిడెంట్గా, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా ఉన్నారు.. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా
ఢిల్లీ చీఫ్ జస్టిస్ గా పనిచేసిన డి మురుగేశన్ జూన్ లో పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో జస్టిస్ రమణను ప్రధాన న్యాయమూర్తిగా భారత ప్రధాన న్యాయమూర్తి పి. సతాశివం నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ మేరకు 2013 సెప్టెంబరు 2 సోమవారం రోజు, రాజ్ నివాస్ లో ఆడంబరంగా జరిగిన ఓ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ చేతుల మీదుగా జస్టిస్ రమణ ప్రమాణ స్వీకారం చేశారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా
2014 ఫిబ్రవరి 7 న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టీస్ చలమేశ్వర్ సుప్రీం కోర్టులో న్యాయ మూర్తిగా చేసి రిటైరయ్యారు.. ప్రస్తుతం వెంకట రమణ సుప్రీం కోర్టు సీనియర్ న్యాయ మూర్తిగా కొనసాగుతున్నారు. 1966 జూన్ 30 నుండి 1967 ఏప్రిల్ 11 వరకు మరో తెలుగు వ్యక్తి కోకా సుబ్బారావు సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తిగా బాధ్యతలను నెరవేర్చారు.

విశేషాలు
తెలుగు భాషపై మక్కువ ఎక్కువ. అవసరమైతే తప్ప ఆంగ్లంలో మాట్లాడరు. తెలుగులోనే పలుకరిస్తారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా తెలుగునే ఎక్కువగా వాడుతుంటారు. కోర్టు వ్యవహారాల్లో పారదర్శకత అవసరం. మనకు తెలిసిన మన యాసతో కూడిన, మన తెలుగుభాషలో మాట్లాడడానికి, కేసుల్లో వాదించడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు అంటారు.
ఆల్మట్టి పై రాష్ట్ర ప్రభుత్వం తరుఫున న్యాయవాదిగా పనిచేశారు. 13 సంవత్సరాల కాలంలో దాదాపు 60వేల కేసులను పరిష్కరించారు. ముస్లిం రిజర్వేషన్లపై విచారణ జరిపిన ఐదుగురు జడ్జీల ధర్మాసనంలో జస్టిస్ రమణ ఒకరు. ఈ కేసులో మెజారిటీ జడ్జీల తీర్పుతో ఆయన విభేదించారు. కులాలు, మతాలవారీ రిజర్వేషన్లు సంఘాన్ని విడగొడతాయని, రిజర్వేషన్లు ఎప్పుడూ ఆర్థిక అసమానతల ఆధారంగానే ఉండాలన్నారు. పర్యావరణ కేసుల్లో చెరువు లు, కుంటల పరీవాహక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టరాదని, అటవీ విస్తీర్ణాన్ని పెంచాలని తీర్పులు చెప్పారు.
Delhi: Justice NV Ramana takes oath as the new Chief Justice of India (CJI). He was administered the oath by President Ram Nath Kovind, at Rashtrapati Bhavan. pic.twitter.com/jDESeLZh2D
— ANI (@ANI) April 24, 2021