కార్తీక పౌర్ణమి తిథి నిర్ణయం: సంశయ నివృత్తి..

కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అనగా కార్తీక మాసములో శుక్ల పక్షములో పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీకమాసములో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరి, హారులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అన్ని మాసాల్లోను కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగినది అని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. ‘శివునికి, విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున, కావున మానవాళికి వారిద్దరిని కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో ‘ప్రాశస్త్యం’ కలిగినది అని పురాణాలుతెలుపుతున్నాయి. ఇంత ప్రశస్తి గల కార్తీక పౌర్ణమి ఈ ఏడాది నవంబరు 30న రానుంది. ఆ రోజు ఏవైనా దానాలు, పుణ్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసినట్లయితే మనుషుల జన్మజన్మలకు ఆ ఫలితం ఉంటుంది.
అయితే ఈ సారి కార్తీక పౌర్ణమి తిధి 29వ తేదీ మధ్యాహ్నం 12.09 నిమిషాల నుండి మరుసటి రోజు మధ్యాహ్నం 2.03 నిమిషాలు వరకు ఉన్నందున భక్తులు కొంత సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏ రోజున కార్తీక పౌర్ణమి జరుపుకోవాలనేది పలువురు భక్తుల సందేహం. దీనిని మిగులు. తగులు.. అని అంటారు.
దీనికి పెద్దగా కంగారు పడవలసిన పని లేదు. సహజంగా చంద్రునికి సంబంధించిన పండుగలలో వేద నిర్ణయం ప్రకారం రాత్రులకు ప్రాధాన్యత ఉంటుంది. అంటే దీపావళిని ఖచ్చితంగా ఆరోజు రాత్రి సమయంలో అమావాస్య తిధి కలిగి ఉన్న రోజున మాత్రమే జరుపుకొని తీరాలి.
అలాగే పౌర్ణమి కూడా..
రాత్రిపూట స్థిరంగా ఉండే తిధిని ప్రామాణికంగా తీసుకుని తీరవలసిందే. ఇక్కడ ప్రత్యేకించి గమనించవలసిన విషయం ఏమిటంటే ఇతర పండుగలు జరుపుకుంటున్నట్లు, సూర్యోదయంలో ఉన్న తిధికి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాన్ని మనం మరచిపోవాలి. మరో ముఖ్య విషయం ఏమిటంటే. కృత్తిక నక్షత్రం పౌర్ణమి తిధిలో కలిగి ఉన్న మాసాన్ని కార్తీక మాసం అంటారనే విషయం మీకు తెలుసనుకుంటున్నాను.
ఈ నక్షత్ర గమనం ప్రకారం కూడా ఆదివారం రాత్రి పౌర్ణమి తిధితో కృత్తిక నక్షత్రం కలిసి ఉంటుంది. ఆ విధంగా పౌర్ణమి తిధితో కృత్తిక నక్షత్రం, సోమవారం ఉదయం 6:06 వరకు మాత్రమే జత కూడి ఉంటుంది. కాబట్టి కార్తీక పౌర్ణమి ఖచ్చితంగా 29వ తేదీన.. ఆదివారం మాత్రమే జరుపుకుని తీరాలి.
మరుసటి రోజు అంటే సోమవారం రాత్రికి జరుపుకుంటే రెండవ చంద్రుడు అవుతాడు. కృష్ణపక్షం వచ్చేస్తుంది. కొంతమేర, సౌలభ్యత కోసం చెప్పుకోవాలంటే.. ఉపవాస నియమం ఉన్న, ఉండాలనుకునే వారు మాత్రం 29వ తేదీ ఉపవాస నియమాలు పాటించి రాత్రిపూట ఒత్తులు వెలిగించుకొని, చంద్రదర్శనం చేసుకుని భోజనం చేయవచ్చు.
ఉపవాస నియమం లేని వారు..
దీపాలు మాత్రమే వెలిగించాలనుకునేవారు 29వ తేదీ రాత్రి లేదా 30వ తేదీ ఉదయం ఆరు గంటల లోపు అంటే సూర్యోదయం కాకముందే ఒత్తులు వెలిగించు కోవచ్చు.
30వ తేదీ సోమవారం కూడాను…
మరో లెక్క ప్రకారం కార్తీక మాసం 15వ రోజు కూడా అవుతుంది. కాబట్టి వత్తులు వెలిగించాలి అనుకునేవారికి మాత్రం 30వ తేదీ మధ్యాహ్నం లోపు నిరాహారంగా ఉండి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయవచ్చు. అదేవిధంగా నోములు, తోరాలు ఉన్నవారు కూడా 30వ తేదీ సోమవారం మధ్యాహ్నం లోపు ఆ కార్యక్రమాన్ని చేపట్టవచ్చు. పౌర్ణమి తిధి ఉంటుంది కాబట్టి 29వ తేదీ ఆదివారం సాయంత్రం కూడా నోములు, వ్రతాలు చేసుకోవచ్చు ఆక్షేపణ లేదు. పెద్దగా ఇందులో సందేహించాల్సిన పని లేదు. మనం భగవంతునికి ఆత్మ నివేదన చేసుకోవాలి. తద్వారా చేసినటువంటి ఏ కార్యక్రమం అయినా భగవంతునికి ప్రీతిపాత్రమే. నిరంతర నామస్మరణతో సర్వేశ్వరుడు మన వెన్నంటే ఉంటారు.
సర్వే జనాః సుజనోభవంతు..!
సర్వే సుజనాః సుఖినోభవంతు..!!
-ఎన్.రాజ్యలక్షి
జ్యోతిష్యపండితులు