దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు..

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి ఈ మధ్య కాలంలో తగ్గినట్టే కనిపించింది కానీ మళ్లీ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 32,080 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటికంటే 21 శాతం ఎక్కువ అని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న దేశంలో 26,567 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 97,35,850కి చేరాయి. ఇందులో 3,78,909 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారినపడినవారిలో ఇప్పటివరకు 92,15,581 మంది బాధితులు కోలుకున్నారు. ఇందులో గత 24 గంటల్లో 36,635 మంది మహమ్మారి నుంచి బయటపడి డిశ్చార్జీ అయ్యారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు 402 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 1,41,360కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. దేశంలో నిన్న ఒకేరోజు 10,22,712 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. దీంతో డిసెంబర్ 8 వరకు మొత్తం 14,98,36,767 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.