మహమ్మారి అంతానికి మన్మోహన్ సూచనలు
మోడీకి లేఖ రాసిన మాజీ ప్రధాని

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై పలు సూచనలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. మరింత మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ను అందుబాటులోకి తేవాలని కోరారు. మహమ్మారిని నియంత్రించడంలో వ్యాక్సిన్ను సాధ్యమైనంత ఎక్కువ మందికి ఇవ్వడమే ముఖ్యమైన విషయం అని ఆయన సూచించారు. ఇన్ని కోట్ల మందికి వ్యాక్సిన్లు వేశామని చెప్పడం కాదు.. అసలు జనాభాలో ఎంత శాతం మందికి వేశామో చూసుకోవాలని ఆ లేఖలో మన్మోహన్ అన్నారు.
మన్మోహన్ లేఖలో ఏముందంటే..
‘‘భారత్తో పాటు మిగతా దేశాలన్నీ కోవిడ్-19 మహమ్మారితో పోరాటం ప్రారంభించి ఏడాది దాటిపోయింది.
ఎంతోమంది తల్లిదండ్రులు ఈ ఏడాది కాలంలో తమ పిల్లలను చూడలేకపోయారు. తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు తమ మనమలు, మనమరాళ్లను చూడలేకపోయారు. ఉపాధ్యాయులు తరగతి గదుల్లో తమ విద్యార్థులను చూడలేదు. ఇక ఎంతోమంది తమ జీవనాధారాన్నే కోల్పోయారు. కోట్లాది మంది పేదరికంలో చిక్కుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా మనమంతా చూస్తున్న కరోనావైరస్ సెకండ్ వేవ్తో తమ జీవితాలు మళ్లీ మామూలు స్థితికి ఎప్పుడొస్తాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు’’ అని మన్మోహన్ తన లేఖలో రాశారు.
‘‘ఈ మహమ్మారితో పోరాటానికి మనం తప్పనిసరిగా చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. అందులో ప్రధానమైనది వ్యాక్సినేషన్ వేగం పెంచడం. ఈ విషయంలో నా వైపు నుంచి కొన్ని సూచనలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను.. వాటిని పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాను.
సూచనలు…
- ) వచ్చే ఆరు నెలల కాలానికి సరఫరా చేయడం కోసం వివిధ వ్యాక్సీన్ తయారీ కంపెనీలకు ఇచ్చిన ఆర్డర్ల వివరాలు బహిరంగపర్చాలి. వచ్చే ఆరు నెలల కాలానికి వ్యాక్సీనేషన్ కోసం మనం పెట్టుకున్న టార్గెట్లకు అనుగుణంగా ముందస్తుగా ఆర్డర్లు ఇస్తే దాని ప్రకారం తయారీ సంస్థలు సరఫరా చేస్తాయి.
- ఈ వ్యాక్సీన్ దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఎలా పంపిణీ చేస్తారన్నదీ పారదర్శకంగా ప్రకటించాలి. కేంద్రం వద్ద అత్యవసరం కోసం 10 శాతం వ్యాక్సీన్ ఉంచొచ్చు. అది పోను మిగతాదంతా ఏ రాష్ట్రానికి ఎన్ని వస్తాయి.. ఎప్పుడు వస్తాయన్నది స్పష్టంగా ఉంటే దాన్నిబట్టి రాష్ట్రాలు ప్రణాళిక వేసుకుంటాయి.
- అలాగే ఫ్రంట్ లైన్ వర్కర్స్ కేటగిరీలోకి ఎవరెవరు వస్తారన్నది రాష్ట్రాలే నిర్ణయించుకునేలా ఉండాలి. స్కూల్ టీచర్లు, బస్ డ్రైవర్లు, పంచాయతీల సిబ్బంది, లాయర్లు వంటివారిని కొన్ని రాష్ట్రాలు ఫ్రంట్ లైన్ వర్కర్లుగా గుర్తించి 45 ఏళ్ల కంటే తక్కువ వయసున్నా వ్యాక్సీన్ వేయాలనుకోవచ్చు. రాష్ట్రాలకు ఆ వెసులుబాటు ఉండాలి.
- గత కొన్ని దశాబ్దాలుగా భారత్ ప్రపంచంలోనే వ్యాక్సీన్ల తయారీలో ముందుంది. ఈ ఉత్పత్తి సామర్థ్యంలో అత్యధికం ప్రైవేటు చేతుల్లోనే ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో దేశంలోని వ్యాక్సీన్ ఉత్పత్తి సంస్థలకు ప్రభుత్వం సహకారం అందించాలి. నిధులు సమకూర్చడం, రాయితీలు ఇవ్వడం ద్వారా ఉత్పత్తి మరింత పెంచేలా చేయగలగాలి.
- దేశీయ ఉత్పత్తి మన అవసరాలకు చాలకపోవడం వల్ల యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ, యూఎస్ఎఫ్డీఏ వంటి నమ్మకమైన సంస్థల అనుమతులు పొందిన విదేశీ వ్యాక్సీన్లనూ ఈ అత్యవసర పరిస్థితుల్లో మనం అనుమతించొచ్చు. మన దేశంలో బ్రిడ్జింగ్ ట్రయల్స్ కోసం పట్టుపట్టరాదు. కాదంటే పరిమిత కాలానికే ఈ వెసులుబాటు ఇస్తూ నిర్ణయం తీసుకోవచ్చు.
ప్రస్తుతానికి మన దేశంలో కొద్దిమంది జనాభాకే వ్యాక్సీన్ వేసినప్పటికీ తగిన విధాన నిర్ణయాలతో త్వరలోనే మరింతమందికి వేయగలమనుకుంటున్నాను.
నా సూచనలను ప్రభుత్వం స్వీకరిస్తుందని, ఆ మేరకు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను.’ అని లేఖలో మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు.