రైతులకు మద్దతుగా అన్నా హజారే నిరాహార దీక్ష

హైదరాబాద్: కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈ రోజు భారత్ బంద్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా సామాజిక కార్యకర్త అన్నా హజారే నిరాహార దీక్ష చేపట్టారు. మహారాష్ట్రలోని అహమ్మద్ నగర్ జిల్లాలోని రాలేగావ్ సిద్ధి గ్రామంలో అన్నా హజారే ఒక రోజు నిరాహార దీక్ష చేపడుతున్నారు. రైతు ఆందోళనలను దేశవ్యాప్తంగా ఉదృతంగా చేయాలని, ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలని అన్నా హజారే తెలిపారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిర్వహిస్తున్న నిరసనను హజారా ప్రశంసించారు. పది రోజుల నుంచి జరుగుతున్న నిరసనల్లో ఎటువంటి హింస చోటుచేసుకోలేదన్నారు. స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.