ఉద్యమంలో మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు

ఛండీగఢ్: రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారంతోపాటు వారి కుటుంబంలో ఒకరికి సర్కార్ జాబ్ ఇవ్వనున్నట్టు పంజాబ్ సిఎం అమరీందర్ సింగ్ శనివారం ప్రకటించారు. రైతు ఉద్యమంలో ఇప్పటివరకు దాదాపు 76 మంది చనిపోయారు.
కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ సర్కార్ కొత్తగా 2020 సెప్టెంబరులో రూపొందించిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేస్తున్న విషయం మనకు తెలిసిందే. రైతన్నలు దాదాపు నెల రోజులకు పైగా దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఉద్యమం చేస్తున్నారు. కాగా అన్నదాతల ఆందోళనలో పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 76 మంది చనిపోయినట్లు తెలుస్తున్నది.
ఈ నేపథ్యంలో తన ఫేస్బుక్ లైవ్ ప్రోగ్రాం ‘ఆస్క్ ది కెప్టెన్’లో ఈమేరకు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ రైతన్నల కుటుంబాను ఆదుకుంటామని ప్రకటన చేశారు.