జనవరి 16 నుంచి వ్యాక్సిన్ కు రెడీ అయిన తెలంగాణ

ఢిల్లీ/హైదరాబాద్: ఈ నెల 16న వ్యాక్సినేషన్ కు తెలంగాణ రాష్ట్రం సిద్ధం అయింది. 16వ తేదీన తెలంగాణలో 139 సెంటర్లలో వాక్సిన్ జరగనుంది. ప్రతి జిల్లాలో రెండు నుంచి మూడు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అయితే జిహెచ్ఎంసి పరిధిలో ఎక్కువ వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 139 సెంటర్లలో మొదటిరోజు 13900 మందికి టీకా వేయనున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న హెల్త్ కేర్ వర్కర్లు రెండు లక్షల తొంభై వేల మంది వాక్సిన్ కోసం నమోదు చేసుకున్నారు.
కాగా దేశంలో జనవరి 16వ తేదీ నుంచి కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుందని కేంద్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం ప్రకటించింది. వ్యాక్సిన్ పంపిణీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మూడు కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్లైన్ సిబ్బంది (వైద్యులు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్, పోలీసులు అదేవిధంగా మహమ్మారిపై పోరాటంలో ప్రత్యక్షంగా ఉన్న వారికి) మొదటి ప్రాధాన్యతగా వాక్సినేషన్ను అందించనున్నారు. వీరంతా కలిపి దేశంలో 3 కోట్ల మంది వరకు ఉంటారని కేంద్రం అంచనా వేసింది. మొదట వీరందరికీ కరోనా టీకా వేసిన తర్వాత 50 ఏళ్లు పైబడిన వారికి టీకా ఇవ్వనున్నారు. 16వ తేదీన రాష్ర్టంలోని రెండు వాక్సిన్ కేంద్రాలతో ప్రధానమంత్రి ఇంటరాక్ట్ కానున్నారు.