నా ఇల్లే నా తరగతి గది
ఇన్నోవేటివ్ ఆక్టివిటీతో విద్యార్థుల అభ్యసన సామర్ధ్యం పెంచుతున్న ఉపాధ్యాయుడు అడ్డిచర్ల సాగర్

పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తున్న సమయంలో ముఖ్యమైన అంశాలను చార్ట్ పైన రాయించడం, ముఖ్యమైన చిత్రాలు గీయించలం, అదేవిధంగా సామాన్య శాస్త్రంలో ప్రయోగాల పటాలు, గీయించడం మాదిరి నమూనాలు చేయించడం, వాటిని తరగతి గదిలో గోడకు అంటించి లేదా వ్రేలాడదీసి వారి ప్రతిభను ప్రదర్శించి, వారి అభ్యసన సామర్ధ్యాలు పెరిగే విధంగా ప్రోత్సహిస్తారు ఉపాద్యాయులు.
ముఖ్యమైన అంశాలు ఛార్జ్ పైన రాసి ప్రదర్శన చేయడం వలన విద్యార్థులు తమ ప్రతిభను తాము చూసుకుంటారు,. అదేవిధంగా తరచుగా ఆ అంశాలను చూస్తూ మననం చేసుకుంటారు. తోటి విద్యార్థుల పనితో, వారి పనిని పోల్చుకొని మరింత ప్రతిభను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో ప్రశంసలు అందుకుంటారు.

లాక్ డౌన్ కాలంలో పాఠశాలలు తెరువకపోవడం వలన, విద్యార్థిని విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ, ఫోన్ లేదా టీవీ ద్వారా వీడియో పాఠాలు వింటూ, చదువు నేర్చుకుంటున్నారు. వీటితో పాటుగా తరగతి గదిలో అనుసరించిన విధానం ఇంట్లో కూడా అనుసరిస్తే విద్యార్థులు చురుకుగా ఉంటూ, ముఖ్యమైన అంశాలకు సంబంధించిన కృత్యాలు చేస్తూ, వాటిని వారి ఇంటి గోడకు వేలాడదీసి, తరచుగా చూస్తూ, మననం చేసుకుంటూ ఆ విషయాలను మర్చిపోకుండా ఉంటారు. అదేవిధంగా వారు చేస్తున్న కృత్యాలను తల్లిదండ్రులు చూసి సంతోషంగా వారికి ఇంకా ఎంతో సహకారం అందించే అవకాశాలు ఉంటాయి అని వినూత్నంగా ఆలోచించాడు ఉపాద్యాయుడు అడ్డిచర్ల సాగర్…
కావున ఈ కృత్యం పేరు “నా ఇల్లు నా తరగతి గది” అని నామకరణం చేసి, అమలు చేస్తున్నాడు. ఈ కృత్యంతో విద్యార్థుల విషయ పరిజ్ఞానం పెంపొంది, వారిలో చురుకుదనం పెరుగుతుంది.
తన విద్యార్థులతో పాటు ఇతర పాఠశాలల విద్యార్థులకు మరియు గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న తన ఉపాద్యాయ మిత్రుల సహకారంతో వారి విద్యార్థులచే కూడా ఈ కృత్యం ద్వారా విద్యా అభ్యసనం చేయిస్తున్నాడు. టీవీ లో లేదా ఫోన్ లో పాఠాలు చూసిన తర్వాత ఆయా సబ్జెక్టులలోని ముఖ్యమైన అంశాలు కృత్యం రూపంలో చేయడం ద్వారా మానసికంగా, శారీరకంగా ఎంతో ఉత్సాహంగా అనిపిస్తోంది అని ఆ విద్యార్థులు తెలియజేస్తున్నారు.
ఈ కృత్యం ద్వారా విద్యాభ్యాసం చేసేవారితో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వారికి సలహాలు సూచనలు చేస్తున్నాడు. మంచి ప్రతిభ చూపిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్నాడు.

ఈ కృత్యం ద్వారా ఎన్నో లక్ష్యాలు సాధించవచ్చు, అందులో ప్రధానమైనవి
- 1 విద్యార్థినీ విద్యార్థులలో చురుకుదనం పెంపొందించడం.
- 2 విషయ పరిజ్ఞానం పెంపొందించడం.
- 3 ముఖ్యమైన అంశాలు సులభంగా నేర్పించడం.
- 4 తల్లిదండ్రుల ప్రశంసలు అందుకునే విధంగా ప్రోత్సహించడం.
- 5 డిజిటల్ విద్యతోపాటు కృత్యాధార బోధనను కూడా ప్రోత్సహించడం.
- 6 లాక్ డౌన్ సమయంలో కూడా పాఠశాల వాతావరణం అనుభూతిని కల్పించడం
- 7 ప్రత్యామ్నాయ అభ్యసన పద్ధతులను అవలంబించే విధంగా ఆలోచనలు పెంపొందించడం.

నేర్పించడం.. నేర్చుకోవడం సులభం
ఈ ఉపాద్యాయుడి వినూత్నమైన కృత్యం ఈ కరోనా కాలంలో, ప్రత్యక్ష బోధన జరుగని సమయంలో, ఆచరణ సాధ్యంగా ఉంది మరియు అందరికీ ఉపయోగపడే విధంగా ఉంది. దీని ద్వారా ఉపాద్యాయులు వారి విద్యార్థులకు ముఖ్యమైన విషయాలు నేర్పించడం సులభం మరియు విద్యార్థులు నేర్చుకోవడం సులభం.


