హైదరాబాద్లో మరికొన్ని గంటలు భారీ వర్షాలు

హైదరాబాద్ (CLiC2NEWS): గులాబ్ తుఫాను కారణంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే జీహెచ్ఎంసీ హైఅలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సోమవారం నగర వాసులకు హెచ్చరికలు జారీ చేసింది. నగరంలో మరికొద్ది గంటల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలంతా ఇండ్లలోనే ఉండాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది.
భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష..
భారీ వర్షాలపై సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో ఢిల్లీ నుంచి సీఎం కేసీఆర్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గులాబ్ తుఫాను ప్రభావంతో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పోలీసు, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో పని చేయాలని కేసీఆర్ సూచించారు.