నిలిచిన బొగ్గు ఉత్పత్తి.. సింగరేణిలో జంగ్ సైరన్..
బెల్లంపల్లి రీజియన్లోని గనుల్లో సమ్మె సంపూర్ణం

మంచిర్యాల (CLiC2NEWS): బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు నిరసనగా బొగ్గు కార్మికులు చేపట్టి 72 గంటల సమ్మె కొనసాగుతోంది. సింగరేణిలోని 4 బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన సమ్మెతో బొగ్గు గునుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. టిబిజీకెఎస్తో పాటు ఎఐటియుసి, ఐఎన్టీయూసీ, హెచ్ ఎంసి, సిఐటియు తదితర జాతీయ సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించాయి. ఇవాళ ఉదయం ఫస్ట్ షిప్ట్ నుంచే కార్మికులు విధులకు హాజరుకాలేదు. దీంతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ సమ్మె మూడు రోజుల పాటు కొనసాగనుంది. సమ్మెలో దాదాపు 40 వేల మంది కార్మికులు, 25 వేల మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది పాల్గొంటున్నారు.
బెల్లంపల్లి రీజియన్లోని గనుల్లో సమ్మె సంపూర్ణం
బెల్లంపల్లి రీజియన్లోని శ్రీరాం పూర్, బెల్లం పల్లి, మందమర్రి ఏరియా గనుల్లో సమ్మె సంపూర్ణంగా జరుగుతోంది. ఆర్కే 7 బొగ్గు గని వద్ద కార్మిక సంఘాలు నిరసనకు దిగారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య నిరసనలో పాల్గొని ప్రసంగించారు. కేంద్రం నిర్ణయంతో సింగరేణి మనుగడకే ప్రమాదం జరుగనుందని, కార్మికుల భవిష్యతకు ముప్పు పొంచి ఉందని అన్నారు. భేషరతుగా వేలం నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని, అప్పటి వరకు ఆందోళనలు కొనసాగుతాయని వాసిరెడ్డి స్పష్టం చేశారు.