కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందే..
మృతుల పరిహారంపై ఆరు వారాల్లో తేల్చండి: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ (CLiC2NEWS): కరోనా మృతుల కుటుంబాలకు కేంద్ర సర్కార్ పరిహారం చెల్లించాలని బుధవారం సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దానికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించడానికి ఆరు వారాల గడువును విధించింది. ఎంత మొత్తం చెల్లించాలనేది మాత్రం ప్రభుత్వానికే వదిలివేసింది.
జస్టిస్ అశోక్ భూషన్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ 19 బలితీసుకున్న కుటుంబాలకు.. కనీసం ఉపశమనం కలిగించేందుకు ఎంతమొత్తం పరిహారం అందించాలో ఆరు వారాల్లో నిర్ణయించాలని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీకి సూచించింది.
బీమా పథకం.. ఫైనాన్స్ కమిషన్ ప్రతిపాదనల మేరకు విపత్తు కారణంగా మరణించే వారి కుటుంబ సభ్యుల కోసం బీమా పథకాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది.
కరోనా కారణంగా మరణించిన వారిపై ఆధారపడిన కుటుంబసభ్యులకు ధృవీకరణ పత్రాలను మంజూరు చేసే ప్రక్రియను సరళతరం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
కొవిడ్ కారణంగా మరణించిన ప్రతి ఒక్కరికి రూ. 4 లక్షలు చెల్లించలేమని కొద్ది రోజు కిందట కేంద్ర ప్రభుత్వం కోర్టుకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 183 పేజీల ప్రమాణ పత్రాన్ని సమర్పించింది. కొవిడ్ మృతుల కుటుంబాలన్నింటికీ పరిహారం చెల్లించాలంటే రాష్ట్రాల ప్రకృతి వైపరీత్య నిధులు పూర్తిగా వాటికే కేటాయించాల్సి వస్తుందని.. అలా చేస్తే మహమ్మారి నియంత్రణకు నిధులేమీ మిగలవని న్యాయస్థానానికి కేంద్రం తెలిపింది.
ఈ క్రమంలో ప్రభుత్వ వినిపించిన వాదనలను పరిశీలించిన సుప్రీం కోర్టు బాధితుల కుటుంబాలకు ఉపశమనం కలిగించే నిమిత్తం జాతీయ విపత్తు నిర్వహణ అథారిటి (ఎన్ డి ఎం ఎ) కనీస ప్రమాణాలు రూపొందించాలని ఆదేశించింది. తద్వార కొంత మొత్తం చెల్లించవచ్చని చెప్పింది. కనీస ప్రమాణాలు రూపొందించడంలో ఎన్ డి ఎం ఎ విఫలమైందని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. విపత్తు నిర్వహణ చట్ట ప్రకారం పరిహారం తప్పనిసరి అని కోర్టు స్పష్టం చేసింది.
జాతీయ ప్రకృతి వైపరీత్య చట్టం కింద 2015 ఏప్రిల్ 8న కేంద్ర హోం శాఖ జారీచేసిన ఉత్తర్వుల మేరకు కొవిడ్ మృతుల కుటుంబాలకు 4 లక్షల పరిహారం చెల్లించేలా ఆదేశించాలని గౌరవ్కుమార్ బన్సల్ కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్పై వాదనలు విన్న న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.