రైతు కేంద్ర బిందువుగా రైతు వేదికలు: ఆర్థిక మంత్రి హరీశ్రావు

సిద్ధిపేట (CLiC2NEWS): తెలంగాణలో రైతు కేంద్ర బిందువులుగా రైతు వేదికలు ఏర్పాటు చేసినట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రమైన సిద్ధిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామంలో శనివారం వర్మీ కంపోస్టు తయారీ కేంద్రాన్ని, గ్రామ పంచాయతీ నర్సరీని మంత్రి ప్రారంభించారు.
అంతకుముందు హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. తారువాత పొన్నాల గ్రామ పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ లో స్టీల్ బ్యాంకును ప్రారంభించారు. ఓపెన్ జిమ్, స్మశాన వాటిక, రైతు వేదికను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. సిద్ధిపేట పట్టణీకరణ భవిష్యత్ పొన్నాల వైపు ఉన్నదని, కొత్త కలెక్టరేట్, రైల్వే లైను మీదుగా పోవడంతో శరవేగంగా పొన్నాల పట్టణాభివృద్ధి జరుగుతున్నదని మంత్రి చెప్పారు.