Hyderabad: మెట్రో సేవల్లో మార్పులు

సిటీ బ‌స్సుల వేళల్లో మార్పులు..

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా ఉధృతితో తెలంగాణ ప్ర‌భుత్వం రాత్రి కర్ఫ్యూ అమ‌లు చేస్తున్న నేప‌థ్యంలో మెట్రో రైలు స‌ర్వీసు వేళ‌ల్లో మార్పులు జ‌రిగాయి. ఈ నేపథ్యంలో మెట్రో సేవల్లో మార్పులు చేస్తున్నట్లు ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి మంగళవారం ప్రకటించారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లోకి ఉండటంతో.. రాత్రి 7.40 గంటల వరకే మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి అని తెలిపారు. అవి గ‌మ్య‌స్థానాల‌కు రాత్రి 8.45 గంటల్లోపే చేరుకుంటాయ‌ని తెలిపారు.

ఇక ప్రతి రోజు ఉదయం 6.30 గంటలకు మెట్రో సేవలు ప్రారంభం అవుతాయని తెలిపారు. ప్ర‌యాణికులు త‌ప్ప‌నిస‌రిగా క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ సిబ్బందికి స‌హ‌క‌రించాల‌ని కోరారు.
మాస్క్‌ లేని వారికి మెట్రోలోకి అనుమతి లేదన్నారు. కోవిడ్ 19 సేఫ్టీ గైడ్‌లైన్స్ ప్రకారం భౌతిక దూరం పాటించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లు అందుబాటులో ఉంచామని ఎన్‌వీఎస్‌ రెడ్డి తెలిపారు.

నేటి నుంచి మే 1 వరకు నైట్‌ కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది. అత్యసవర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిస్తున్నట్లు తెలిపింది. ఇక రాత్రి 8 గంటల వరకే బార్లు, రెస్టారెంట్లు, థియేటర్స్‌ నిర్వహణకు అనుమతినిచ్చింది. ఈ మేర‌కు స‌ర్కార్ ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే.

సిటీ బ‌స్సుల వేళల్లో మార్పులు..
రాత్రి క‌ర్ఫ్యూ నేప‌థ్యంలో సిటీ బ‌స్సుల స‌మ‌య పాల‌న‌ను ఆర్టీసీ కుదించింది. స‌ర్కార్ నిబంధ‌న‌ల మేర‌కే బ‌స్సులు న‌డుపుతామ‌ని ఆర్టీసీ ఆప‌రేష‌న్స్ ఇడి యాద‌గిరి తెలిపారు. సిటి బ‌స్సులు రాత్రి 9 గంట‌ల‌లోపు ఆయా డిపోల‌కు చేరుకుంటాయ‌ని వెల్ల‌డించారు. రాత్రి 9 త‌ర్వాత బ‌య‌లు దేరాల్సిన బ‌స్స‌లు 9 లోపు వెళ్లేలా స‌మ‌న్వ‌యం చేసుకోవాల్సిందిగా ఆయా డిపో మేనేజ‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.