తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
గండేపల్లి (CLiC2NEWS): తూర్పు గోదావరి జిల్లాలో మల్లేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. దైవదర్శనానికి 13 మందితో వెళ్తున్న వాహనం ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఏలూరు జిల్లాలోని వివిధ గ్రామాలు, మండలాలకు చెందిన 13 మంది టాటా మ్యాజిక్ వాహనంలో అనకాపల్లి జిల్లా కశింకోటలోని పరమటమ్మ తల్లి దర్శనానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మల్లేపల్లి గ్రామశివారులో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నల్లజర్లకు చెందిన వాహనం డ్రైవర్ కొండ (38) అక్కడికక్కడే మృతి చెందాడు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ముగ్గురు మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.