నిలకడగా మెగాహీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం..
ప్రమాదానికి కారణమదే: మాదాపూర్ ఏసీపీ

హైదరాబాద్(CLiC2NEWS): మెగా హీరో సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్ పై ప్రయాణిస్తున్న క్రమంలో ఆయన బైక్ స్కిడ్ అయి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం గురించి తాజాగా మాదాపూర్ ఏసీపీ స్పందించారు. ప్రమాదం జరిగిన సమయంలో సాయి తేజ్ హెల్మెట్ పెట్టుకున్నాడని.. మద్యం సేవించలేదని తెలిపారు. రహదారిపై ఇసుక ఉండటం వల్ల బైక్ స్కిడ్ అయ్యిందని.. దాని వల్ల తేజ్ వాహనాన్ని అదుపు చేయలేకపోయారని ఆయన అన్నారు. ప్రస్తుతం సాయి ఆరోగ్యం నిలకడగా ఉందని.. వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని ఏసీపీ తెలిపారు.
సైబరాబాద్ కమిషనరేట్ రాయదుర్గం పరిధి ఐకియా స్టోర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో కాలర్ బోన్ విరిగిందని, అది పెద్ద సమస్య కాదని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం వెంటిలేషన్పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. 48 గంటలపాటు అబ్జర్వేషన్లో ఉంచుతామన్నారు. ప్రస్తుతానికి తేజ్ ఆరోగ్యంగా నిలకడగానే ఉందని తెలిపారు.