TS: శాసన మండలిలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ శాసన మండలి అయిదుగురు సభ్యులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసన సభ్యుల కోటాలో ఎన్నికైన ఆరుగురు సభ్యుల ఎన్నికను గుర్తిస్తూ బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. శాసన మండలి ప్రొటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డి.. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి చేత ప్రమాణం చేయించారు. ఆరుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా బండా ప్రకాశ్ తన రాజ్యసభ సభ్యత్వ రాజీనామా ఆమోదం పొందిన తర్వాత ప్రమాణం చేస్తారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన 14 రోజుల్లో రాజ్యసభకు రాజీనామా చేయాలనే నిబంధన మేరకు గురువారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు బండా ప్రకాశ్ తెలిపారు.