అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
హైదరాబాద్ : సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం గాగిల్లాపూర్లో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక తీవ్ర మనోవేదనకు గురైన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన నంగి శివలింగం (38) స్థానికంగా తనకున్న మూడెకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ అవసరాలకు, వ్యవసాయ ఖర్చుల నిమిత్తం చేసిన అప్పులు పెరిగాయి. దీంతో అప్పు తీర్చే మార్గం కనిపించక తీవ్ర మనోవేదనకు గురై ఉదయం వ్యవసాయ పొలం వద్ద వెళ్లి పురుగుల మందు తాగాడు. పొలం వద్దకు వెళ్లిన వ్యక్తి ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందాడు. మృతుడికి 12 ఏండ్ల లోపు కుమార్తె, కుమారుడున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.