ఆసిఫాబాద్లో డిజిపి పర్యటన

కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో డీజీపీ మహేందర్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. జిల్లాలో మావోయిస్టుల కదలికలపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్, జిల్లా ఇంచార్జ్ ఎస్పీ సత్యనారాయణ లతో పాటు పోలీసులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని తిర్యాని అడవుల్లో ఇటీవల మావోయిస్టు నేత అడెల్లు అలియాస్ భాస్కర్ సంచరించడంతో పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహించారు. భాస్కర్ డైరీలో లభించిన సమాచారం మేరకు జిల్లాలో కొంతమంది గిరిజన నాయకులు మావోయిస్టులకు సహకరిస్తున్నారనే విషయం బయటపడింది. దీంతో పోలీసులు జిల్లాలో పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోతారని వస్తున్న వదంతుల నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మావోయిస్టు నేత గణపతి కుటుంబ సభ్యులతో చర్చించేందుకు డీజీపీ జిల్లాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. గణపతితో పాటు మరికొంత మంది ముఖ్యమైన మావోయిస్టు నేతలు మల్లోజుల వేణుగోపాల్ ,మల్లా రాజిరెడ్డి, తిరుపతి, కడారి సత్యనారాయణ కూడా లొంగిపోతున్నట్లు సమాచారం.