ఇంటి పైకప్పుపై రూ. 40 లక్షల డబ్బు

లక్నో: అదృష్టమనేది మనిషికి ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. ఒక్కోసారి ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. కొంతమందికి అది ఊహించనంత డబ్బు రూపంలో రావచ్చు. కొంతమందికి మనుషుల రూపంలో రావచ్చు. ఇంకొంతమందికి వస్తువుల రూపంలో రావచ్చు. అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది. సరిగ్గా అలాంటి సంఘటనే ఒక కుటుంబానికి జరిగింది. డబ్బు కట్టలు, బంగారంతో నిండి ఉన్న రెండు బ్యాగులు ఇంటి గుమ్మానికి వేలాడాయి. అయితే, కష్టపడకుండా వచ్చిన సొమ్ము మనకు వద్దంటూ పోలీసులకు అప్పగించేశారు.
ఉత్తరప్రదేశ్లో మీరుట్కు చెందిన ఓ కుటుంబానికి ఉదయం లేవగానే నమ్మలేని దృశ్యం ఎదురుపడింది. డబ్బు కట్టలు, బంగారంతో నిండి ఉన్న రెండు బ్యాగులను వారి ఇంటి పైకప్పుపై గుర్తించిన సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. మీరుట్లో నివాసముంటున్న వరణ్ శర్మ అనే వ్యక్తి బుధవారం ఉదయం తన ఇంటి పైకప్పుపై రెండు బ్యాగులను గుర్తించాడు. తెరిచి చూడగా వాటి నిండ డబ్బు, నగలు కనిపించాయి. ఇది దొంగలించిన డబ్బుగా భావించి వెంటనే సర్దార్ పోలీసు స్టేషన్కు సమాచారం ఇచ్చాడు. అక్కడి చేరుకున్న పోలీసులు దాదాపు 40 లక్షల రూపాయలు విలువ చేసే డబ్బు, బంగారం సంచులను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. వరుణ్ శర్మ ఇంటి పక్కనే ఉన్న వ్యాపారవేత్త పవన్ సింఘాల్కు సంబంధించి సొత్తుగా ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసు అధికారి దీనేష్ బాగెల్ తెలిపారు. ఈ డబ్బు, నగలను పవన్ సింఘాల్ ఇంట్లో రెండేళ్లుగా పనిచేస్తున్న నేపాల్కు చెందిన రాజు దొంగతనం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల నేపాల్కు వెళ్లిన రాజు కొంతకాలం తర్వాత తిరిగి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి సెక్యూరిటి గార్డుతో కలిసి బుధవారం ఈ దొంగతనానికి పాల్పడ్డాడని, ఈ క్రమంలో రెండు బ్యాగుల్లో డబ్బు, బంగారం సర్థేసి సీసీ టీవీలో కనిపించకుండా ఉండేందుకు వరుణ్ శర్మ ఇంటి పైకప్పుపై దాచినట్లు తెలిపారు.