ఐటీ రిటర్న్ల గడువు పొడిగింపు..

ఢిల్లీ: ఐటీ రిటర్నుల దాఖలుకు సంబంధించిన గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు 10 రోజుల గడువు ఇచ్చింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటి రిటర్నులను జనవరి 10 వరకు దాఖలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇక, అకౌంట్ల ఆడిట్ అవసరం లేని, సహజంగా ఐటీర్-1, ఐటీఆర్-4 ఫార్మ్స్ ద్వారా రిటర్న్లు దాఖలు చేసే వారికి ఈ పొడిగింపు వర్తిస్తుందని ఆదాయం పన్ను శాఖ ప్రకటించింది… కాగా, కోవిడ్ కారణంగా ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడగా… మరోసారి కూడా కోవిడ్ తో పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న సవాళ్ల దృష్ట్యా ఈ గడువు పొడిగిస్తున్నట్టు తెలిపింది. ఇక, జీఎస్టీ కింద 2020 ఆర్థిక సంవత్సరం కింద వార్షిక రిటర్న్ల దాఖలు గడువును కూడా 2021 ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటనలో పేర్కొంది. తాజా పొడిగింపుతో వ్యక్తిగత చెల్లింపులకు 10 రోజుల గడువు లభించింది.. వ్యక్తిగత చెల్లింపుదారులు జనవరి 10 వరకు ఐటీ రిటర్న్ దాఖలు చేసుకునే వెసులుబాటు దొరికింది.