ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున బరిలోకి దిగిన సోలిపేట సుజాత తన స్వగ్రామం చిట్టాపూర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ఓటింగ్‌ను తీరుపై ఆమె ఆరా తీశారు. అలాగే దుబ్బాక మండలం బొప్పాపూర్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

దుబ్బాకలో ప్రారంభమైన పోలింగ్‌

హైదరాబాద్‌ :సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయిన పోలింగ్‌.. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కోవిడ్‌ బాధితుల కోసం ప్రత్యే సమయం కేటాయించారు. 148 గ్రామాల్లో 315 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. 89 సమస్యాత్మక కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 23 మంది బరిలో ఉన్నా.. టీఆర్‌ఎస్‌ నుంచి సోలిపేట సుజాత, బీజేపీ నుంచి రఘునంద్‌రావు మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఇంటింటి ప్రచారంలో ప్రతీ ఓటరును నేరుగా కలిసి, ఫోన్లు చేసి తమ పార్టీకి ఓటు వేయాలని అభ్య ర్థించారు. రాజ కీయ పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో పోలింగ్‌ శాతం గతంలో కన్నా పెరిగే అవ కాశముందని భావిస్తున్నారు. దుబ్బాకలో మొత్తం ఓటర్లు 1,98,807 మంది కాగా, పురుష ఓటర్లు 98,028 మంది.. మహిళా ఓటర్లు 1,00,719 మంది ఉన్నారు.

తప్ప‌క‌చ‌ద‌వండి: దుబ్బాకలో ప్రారంభమైన పోలింగ్‌

పోలింగ్‌ కేంద్రాల్లో అధికారులు రెండు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను ఏర్పాటు చేశారు. కరోనా కారణంగా హోంక్వారంటైన్‌లో ఉన్న 130 మందిలో 93 మంది ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. పోలింగ్‌ సమయం ముగియడానికి గంట ముందు కరోనా రోగులను ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. వీరికి ప్రత్యేక పీపీఈ కిట్లు అందించనున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు భౌతికదూరం పాటించేలా ప్రత్యేకంగా గుర్తులను ఏర్పాటు చేశారు. అలాగే పోలింగ్‌ కేంద్రాల్లోకి వచ్చే ప్రతి ఓటర్‌ను స్క్రీనింగ్‌ చేసి లోపలికి అనుమతిస్తున్నారు. అలాగే మాస్క్‌ ధరించేలా చర్యలు తీసుకున్నారు. ఓటర్లకు గ్లౌజ్‌లు, మాస్క్‌లు, శానిటైజర్‌, సబ్బు నీళ్లు అందుబాటులో ఉంచారు.

Leave A Reply

Your email address will not be published.