గూడ్స్ రైళ్ల రద్దుకు నిరసనగా ఢిల్లీలో పంజాబ్ సిఎం ధర్నా

న్యూఢిల్లీ : పంజాబ్కు గూడ్స్ రైళ్లను రద్దు చేసి, ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ తమను ఇబ్బందులకు గురిజేస్తోందని పంజాబ్ సిఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గూడ్స్ రైళ్లను నిలిపివేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు పంజాబ్ సిఎం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. ఇప్పటికే కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ రాష్ట్రమంతటా రైతులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. రైల్ రోకోలు, ధర్నాలు నిర్వహిస్తుండటంతో రైల్వే ఆస్తులకు, యాజమాన్యానికి పెద్ద ఎత్తున నష్టాలు వాటిల్లుతున్నాయి. దీంతో కేంద్ర రైల్వే శాఖ పంజాబ్ రాష్ట్రానికి గూడ్స్ రైళ్లను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. దీంతో పంజాబ్ సిఎం నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంజాబ్ ఎందుర్కొంటున్న పరిస్థితిని రాష్ట్రపతికి నివేదిద్దామని ప్రయత్నిస్తే.. రాష్ట్రపతి తమకు సమయం కేటాయించలేదని అన్నారు. దీంతో ఢిల్లీకి వచ్చి నిరసన తెలుపుదామని నిర్ణయించుకున్నామని చెప్పారు.