చిన్నకోడలితో మామ వివాహేతర సంబంధం.. గొంతుకోసి చంపిన భార్య, పెద్దకోడలు
లక్నో: వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో జీవితాలు నాశనమైపోతున్నాయి. చిన్న కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక వ్యక్తిపై భార్య, పెద్ద కోడలు దాడి చేసి గొంతు కోసి హత్యచేశారు. ఉత్తర ప్రదేశ్లోని భదోహి జిల్లాలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. కొయిరానా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన 55 ఏండ్ల వ్యక్తికి నలుగురు కుమారులున్నారు. వీరిలో ఇద్దరికి పెండ్లి అయ్యింది. కాగా నలుగురు కుమారులు ముంబైలో కూలీ పనులు చేస్తున్నారు. దీంతో పెండ్లి అయిన కుమారుల ఇద్దరి భార్యలు అత్తవారింట్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో చిన్న కోడలిలో మామ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన భార్య, పెద్ద కోడలు ఆమెను పుట్టింటికి పంపారు. దీంతో కోపంతో అతడు వారిద్దరిపై దాడి చేయగా పెద్ద కోడలి కంటికి గాయమైంది. నాటి నుంచి భార్య, పెద్ద కోడలిని దగ్గర్లోని మరో ఇంట్లో ఉంచాడు. అయితే ఐదు రోజుల కిందట చిన్న కోడలిని పుట్టింటి నుంచి తన ఇంటికి రప్పించాడు. శనివారం రాత్రి ఆమెతో కలిసి ఉండగా ఆ ఇంటికి వచ్చిన భార్య, పెద్ద కోడలు అతడ్ని కొట్టి చాకుతో గొంతు కోశారు. భయంతో బయటకెళ్లిన చిన్నకోడలు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఈ విషయం చెప్పింది. పోలీసులు ఇంటికి వచ్చి చూడగా ఆ వ్యక్తి రక్తపు మడుగుల్లో పడి ఉన్నాడు. దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.