తలసేమియా బాధితులకు అండగా నిలవాలి: డిఐజి రాంగనాథ్
నల్లగొండ : తలసేమియాతో బాధపడుతున్న వారికి అండగా నిలుస్తూ వారికి సహకరించడం ఒక సామాజిక బాధ్యతగా భావించాలని డిఐజి ఎ.వి. రంగనాథ్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో తలసేమియా బాధితుల కోసం పోలీస్ సిబ్బందితో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డిఐజి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తలసేమియాతో బాధపడుతున్న వారికి తరచుగా రక్తం మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది.. అలాంటి వారికి అండగా నిలవడం అందరి సామాజిక బాధ్యత అన్నారు. మనతో పాటు మన చుట్టుపక్కల వారి గురించి ఆలోచించడం ద్వారా సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ పరోపకారం చేయాలని సూచించారు. తలసేమియా బాధితుల కోసం పోలీస్ సిబ్బంది రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. రక్తదానం చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.
తలసేమియా బాధితుడు సాయి ఆదిత్య నేతృత్వంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో అదనపు ఎస్పీ నర్మద, ఆర్.ఐ.లు నర్సింహా చారి, శ్రీనివాస్, కృష్ణారావు, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బి.జయరాజ్, నాయకులు సోమయ్య, వన్ టౌన్ సిఐ నిగిడాల సురేష్, టూ టౌన్ ఎస్.ఐ. నర్సింహా, ఆర్.ఎస్.ఐ. అశోక్, సిబ్బంది కిషన్, సైదులు, ప్రదీప్, గిరి తదితరులు పాల్గొన్నారు.