తిరుపతిని మాకివ్వండి!
బీజేపీ అధిష్ఠానాన్ని కోరనున్న జనసేన
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పడు తిరుపతి ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడి నుండి జనసేన పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానంతో చర్చించేందుకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్తో కలసి పవన్ కల్యాణ్ సోమవారం ఢిల్లీ వెళ్లారు. తెలంగాణలోని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి సహకారం అందించేందుకు సిద్ధమయ్యామని, అందువల్ల తిరుపతిలో తమకు అవకాశం ఇవ్వాలని కోరేందుకు పవన్ సిద్ధమయ్యారు. తిరుపతిలో ప్రజారాజ్యం తరఫున చిరంజీవి శాసనసభకు పోటీ చేసి విజయం సాధించిన వైనాన్ని, అక్కడ ఓ బలమైన సామాజికవర్గం ఆది నుంచి జనసేనకు అండగా ఉంటున్న విషయాన్ని పవన్ బీజేపీ అధిష్ఠానానికి వివరించనున్నారని చెబుతున్నారు. అయితే తిరుపతిని తమ బలమైన స్థావరంగా భావిస్తున్న బీజేపీ ఆ స్థానాన్ని వదులుకుంటుందా అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైన తిరుపతి వాసులతో పాటు రాష్ట్ర ప్రజలు బిజెపి నిర్ణయంపై ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.