దుబ్బాకలో పర్యటించిన రాష్ర్ట ప్రధాన ఎన్నికల అధికారి

సిద్దిపేట : దుబ్బాకలో ప్రశాంత వాతావరణంలో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుందని రాష్ర్ట ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ చెప్పారు. దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ సరళిని గోయల్ పరిశీలించారు. లచ్చపేటలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించి.. పోలింగ్ సరళిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శశాంక్ గోయల్ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశామన్నారు. కొవిడ్ జాగ్రత్తలతో పోలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈవీఎంలో సాంకేతిక సమస్యల పరిష్కారానికి నిపుణులను అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు.
దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయిన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కోవిడ్ బాధితుల కోసం ప్రత్యే సమయం కేటాయించారు. దుబ్బాక ఉప ఎన్నికలో ఉదయం 11 గంటల వరకు 34.33 శాతం పోలింగ్ నమోదైంది. 148 గ్రామాల్లో 315 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. 89 సమస్యాత్మక కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 23 మంది బరిలో ఉన్నా.. టీఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాత, బీజేపీ నుంచి రఘునంద్రావు మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఇంటింటి ప్రచారంలో ప్రతీ ఓటరును నేరుగా కలిసి, ఫోన్లు చేసి తమ పార్టీకి ఓటు వేయాలని అభ్య ర్థించారు. రాజ కీయ పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో పోలింగ్ శాతం గతంలో కన్నా పెరిగే అవ కాశముందని భావిస్తున్నారు. దుబ్బాకలో మొత్తం ఓటర్లు 1,98,807 మంది కాగా, పురుష ఓటర్లు 98,028 మంది.. మహిళా ఓటర్లు 1,00,719 మంది ఉన్నారు.