నగదు బదిలీ: కరోనా ప్యాకేజీ ప్రకటించిన బైడెన్

వాషింగ్టన్: కరోనా మహమ్మారితో దెబ్బతిన్న అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బైడెన్ ఇటీవల 15 కీలక కార్యనిర్వాహక అదేశాలపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. కాగా అమెరికా పౌరులకోసం దాదాపు రూ.138.88 లక్షల కోట్లు (1.9 ట్రిలియన్ డాలర్ల) ప్యాకేజీకి సంబంధించిన ఆదేశంపై సంతకం చేశారు. ‘ది అమెరికన్ రెస్క్యూ ప్లాన్’ పేరుతో ఈ భారీ ప్యాకేజి ప్రకటించారు. దీంతో అమెరికాలోని ఒక్కో పౌరుడి బ్యాంకు ఖాతాలో 2 వేల డాలర్లు (1.46 లక్షలు) జమ కానున్నాయి. కాగా క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి నేపథ్యంలో దేశీయ తీవ్రవాదంపై సమీక్ష నిర్వహించేందుకు బైడెన్ నిర్ణయించారు. దీనిపై సమగ్ర అంచనాకు వచ్చేందుకు డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (డీఎన్ఐ), ఎఫ్బీఐ, హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం సమీక్ష జరుపుతాయని వైట్హౌస్ మీడియా కార్యదర్శి జెన్ సాకి తెలిపారు.