ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి కానుక

హైదరాబాద్: దీపావళి పర్వదినాన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు పెద్ద శుభవార్త వినిపించింది. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కే.తారక రామారావు స్వయంగా ఈ శుభవార్తను వెల్లడించారు. రాష్ట్రంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 50 శాతం ఆస్తిపన్ను రాయితీని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దీనిని రాష్ట్రవాసులందరికీ దీపావళి కానుకగా ఆయన అభివర్ణించారు.
హైదరాబాద్కు సంబంధించిన కీలక అంశాలపై తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ దృష్టి సారించారు. ఈమేరకు సచివాలయంలో సీఎస్ సోమేశ్ కుమార్ సహా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మంత్రులు తలసాని, మహమూద్ అలీ, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక ప్రకటించారు.
ఈ రోజు మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్నులో 50శాతం రాయితీ ఇస్తున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. ఇది రూ.15 వేల వరకు ఆస్తిపన్ను కట్టిన వారికి వర్తించనుందని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో రూ.10 వేలలోపు ఆస్తి పన్నుకట్టే వారికి వర్తించనుందని వెల్లడించారు. దీని వల్ల హైదరాబాద్లో 13 లక్షల 72 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. ఆస్తి పన్నులో రాయితీతో రాష్ట్రంపై రూ.130 కోట్ల భారం పడిందన్నారు. వర్షం ఆగకముందే వరద సాయం ప్రకటించిన ఘనత తమదేనన్నారు. నిజమైన వరద బాధితులు మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని కేటీఆర్ తెలిపారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలకు తొందర పడాల్సిన అవసరం లేదని కేటీఆర్ వెల్లడించారు. డిసెంబర్ మొదటి వారంలోనే ఎన్నికలు జరుగుతాయని రెండు రోజులుగా మీడియాలో తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి భిన్నంగా కేటీఆర్ వ్యాఖ్యానించడం గమనించదగ్గ పరిణామం. ఇక… వరద బాధితుల కోసం అదనంగా మరో రూ.70 కోట్లు కేటాయించనున్నట్టు వెల్లడించారు. రేషన్ కార్డు లేకపోయినా బియ్యం అందించామని ఆయన పేర్కొన్నారు. కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం బాగా పనిచేసిందని కేంద్రమంత్రి హర్షవర్థన్ కితాబిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీపావళిని పురస్కరించుకొని పారిశుద్ధ్య కార్మికుల జీతాలు రూ.14,500 నుంచి రూ.17,500కి పెంపుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఎన్నడూ లేని స్థాయిలో కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ మహానగరవాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారిని ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం యధాశక్తి ప్రయత్నించిందని ఆయనన్నారు. దసరా ముందు రోజు నాలుగున్నర లక్షల మందికి వరద సాయం 10 వేల రూపాయలు పంపిణీ చేశామని చెప్పారు. ఇప్పటికీ వరద సాయం అందని వారు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలా దరఖాస్తు చేసుకున్న వారికి అధికారుల తనిఖీల తర్వాత పదివేల ఆర్థిక సాయాన్ని బ్యాంకుల్లో వేస్తామని తెలిపారు.