బేగంపేట‌కు చేరుకున్న జ‌వాన్ల మృత‌దేహాలు

అమర జవాన్లకు నివాళులర్పించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌ : జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారాలో వీరమరణం పొందిన సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్‌ఎఫ్‌) చెందిన తెలుగు సైనికులు ర్యాక మహేశ్‌, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మృతదేహాలు మంగళవారం రాత్రి బేగంపేట విమానాశ్రయానికి చేరాయి. తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ఆర్మీ అధికారులు, నార్త్‌ జోన్‌ డీసీపీ కమలేశ్వర్‌ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ రక్షణలో వారు చేసిన సేవలను కొనియాడారు. అనంతరం ప్రత్యేక వాహనంలో మహేశ్‌ భౌతిక కాయాన్ని స్వగ్రామం నిజామాబాద్‌ జిల్లాకు, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పార్థీవ దేహాన్ని రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు. అంతకు ముందు ఎమ్మెల్సీ కవిత.. మహేశ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు.  జ‌మ్మూ క‌శ్మీర్‌లోని మాచిల్ సెక్టార్‌లోని నియంత్ర‌ణ రేఖ వెంట ఆదివారం జ‌రిగిగిన ఎదురు కాల్పుల్లో ఈ ఇద్ద‌రు వీర జ‌వాన్లు వీర మ‌ర‌ణం పొందారు.

 

Leave A Reply

Your email address will not be published.