బోథ్లో చిరుత కలకలం

ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో తరచూ పులి సంచారం వార్తలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ మండలం మర్లపల్లి గ్రామంలో చిరుత సంచారం వార్త స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. మర్లపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో చిరుత ఓ ఆవుపై దాడి చేసి హతమార్చడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అటవీ అధికారులు చిరుత జాడను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. పశువుల కాపరులను, జీవాల పెంపకందారులను, రైతులను అప్రమత్తం చేశారు. పశువుల కాపరులు అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని సూచించారు. రైతులు రాత్రివేళ పొలాలకు వెళ్లొద్దని అధికారులు కోరారు.