మే 1 నుంచి ఇంటర్ పరీక్షలు: షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి సబిత

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను మే 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మే 1 నుంచి 19 వరకు ప్రథమ సంవత్సరం, మే 2 నుంచి 20 వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం పరీక్షల టైంటేబుల్ను మంత్రి హైదరాబాద్లో విడుదల చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రతిసారి జాతీయ సెలవుదినాలు, ఆదివారాల్లో విరామమిచ్చి పరీక్షలు జరిపేవారు. ఈ సారి అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఒక్క ఆదివారాన్ని మినహాయించారు. సెలవురోజైన మే1 నుంచి పరీక్షలు మొదలు కానున్నాయి. రెండోశనివారం రోజున సెకండియర్ విద్యార్థులకు పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఇంటర్నల్ పరీక్షలయిన ఎథిక్స్ అండ్ హ్యుమన్ వ్యాల్యూస్ పరీక్షను ఏప్రిల్ 1న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను ఏప్రిల్ 3న నిర్వహించనున్నామని చెప్పారు. ఒకేషనల్ కోర్సులకూ ఇదే టైంటేబుల్ వర్తిస్తుందని పేర్కొన్నారు.