యాదాద్రీశుడిని దర్శించుకున్న సిజెఐ దంపతులు

యాదాద్రి భువనగిరి (CLiC2NEWS): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సతీసమేతంగా యాదాద్రీశుడిని దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి ఇవాళ (మంగళవారం) ఉదయం బయలుదేరి యాదాద్రి వెళ్లిన సిజెఐ కు మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఆలయం వద్ద ఎన్వీ రమణ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో ఎదురేగి స్వాగతం పలికారు. అనంతరం ఎన్వీ రమణ దంపతులు బాలాలయంలో ప్రత్యేక పూజలు, అర్చన, అభిషేకం నిర్వహించి మొక్కు చెల్లించుకున్నారు. పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. అనంతరం స్వామివారి శేషవస్త్రం, చిత్రపటంతోపాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
దర్శనం అనంతరం సిజెఐ దంపతులు ఆలయ నిర్మాణాలను పరిశీలించారు. నిర్మాణాల విశిష్టతను సిజెఐ దంపతులకు ఆర్కిటెక్ట్ ఆనందసాయి వివరించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యటన నేపథ్యంలో ఆలయం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.