రాష్ట్రాలు బాగుంటేనే దేశానికి బలం: స్పీకర్ పోచారం
భారత్కు తెలంగాణ దిక్సూచి

రాష్ట్రాలు బాగుంటేనే దేశానికి బలం ః స్పీకర్ పోచారం
భారత్కు తెలంగాణ దిక్సూచి
కామారెడ్డి: రాష్ట్రాలు బాగుంటేనే దేశం బలపడుతుందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ సంస్కృతి అని చెప్పారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో 74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు స్వాతంత్ర ఫలాలు అందుకుంటున్నారని చెప్పారు. అభివృద్ధి విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచి అవుతుందని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా జరుపుకునే గొప్ప పండగ స్వాతంత్ర దినోత్సవమని అన్నారు. అలాంటి పండగను కోవిడ్ వల్ల ఆడంబరంగా జరుపుకోలేకపోతున్నామని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ ప్రజలకు మాత్రం ఆ ఫలాలు అందలేదని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రజలు ఆ ఫలాలు పొందుతున్నారని తెలిపారు.
కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని స్పీకర్ చెప్పారు. పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల రూపురేఖలు మరిపోయాయని తెలిపారు. రైతులకు రైతుబంధు, రైతు బీమా, రుణాలు అందిస్తూ రైతు ప్రభుత్వంగా తెలంగాణకు ప్రత్యేక పేరు వచ్చిందని అన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా గ్రామాలకు ప్రతి నెల 339 కోట్లు, మున్సిపాలిటీలకు 188 కోట్లు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. రైతులు ఒకే చోట సమావేశం నిర్వహించుకునేలా రైతువేదిక పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
త్వరలోనే జిల్లాలో సీఎం పర్యటన
ఉమ్మడి జిల్లాలో త్వరలో సీఎం కేసీఆర్ పర్యటన ఉంటుందని పోచారం తెలిపారు. కరోనా ప్రభావం లేకపోయింఉంటే ఈ పాటికే జిల్లాలో సీఎం పర్యటించేవారని అన్నారు. జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతో పాటు రైతు వేదిక భవనాలు సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభించుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఎన్నికల ముందు రాజకీయాల ముందు మాట్లాడుకుందామని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు. తప్పులు ఉంటే ఎత్తి చూపాలి తప్ప ప్రతి దాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. కాళేశ్వరం జలాలతో కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రాంతాల భూములు సస్యశ్యామలం అవుతాయని చెప్పారు. కరోనాతో పోరాటంలో పోలీసు, వైద్యశాకలు ముందంజలో ఉన్నాయని వారికి కృతజ్ఞతలు తెలిపారు.
నీటి తగాదాలు సృష్టిస్తున్నారు
రాష్ట్రంలో కొద్దీ రోజులుగా కొనసాగుతున్న గోదావరి, కృష్ణా జలాల వివాదంపై స్పీకర మాట్లాడారు. బచావత్ అవార్డు ప్రకారమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుంటున్నామని, పక్క రాష్ట్రాల వారు అవగాహన లోపంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అయినా వాటిని ఎదుర్కొంటున్నామని తెలిపారు. అన్నదమ్ముల్లా రాష్ట్రం నుంచి విడిపోయాం.. ఆత్మీయుళ్ల కలిసి ఉందామని గతంలో అనుకున్నామని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణలో కోటి ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్నామని పేర్కొన్నారు. పక్క రాష్ట్రాల వారు కయ్యాలు, గిల్లికజ్జాలు పెట్టుకోవడం సరికాదన్నారు. పక్క రాష్ట్రాల ప్రతినిధులు గిల్లికజ్జాలకు వెళ్లవద్దని సూచించారు. అనంతరం 32 శాఖలకు సంబందించిన ఈ ఆఫీస్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పీకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్,ఎంపీ బిబిపాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, జడ్పీ చైర్మన్ దఫెదర్ శోభ, జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, ఎస్పీ శ్వేతారెడ్డి, మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి ఇతర అధికారులు పాల్గొన్నారు.