వ్యాక్సిన్ పంపిణీకి తెలంగాణ సిద్ధం..! డీఎంహెచ్వోలతో భేటీ

హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ పంపిణీకి తెలంగాణ సర్కార్ సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలోకి వాక్సిన్ వచ్చిన వెంటనే అందించడానికి రంగం సిద్ధం చేస్తోంది. దీనిపై చర్చించడానికి హైదరాబాద్లోని కుటుంబ సంక్షేమశాఖ కార్యాలయంలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. అన్ని జిల్లాల డీఎంహెచ్వోలతో సమాలోచనలు చేస్తున్నారు. వ్యాక్సిన్ వస్తే ఉంచడానికి ఇప్పటికే కోల్డ్ స్టోరేజ్లు సిద్ధం చేశారు అధికారులు. రాష్ట్రానికి వాక్సిన్ ఎప్పుడు వచ్చినా స్టోర్, పంపిణీ, వ్యాక్సిన్ వేయడం కోసం ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది..ఇక, తొలి దశలో 80 లక్షల మందికి టీకాలు ఇచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ముందుగా కరోనా వారియర్స్ కి , పారిశుధ్య కార్మికులకు, పోలీసులకు ఆ తర్వాత 50 సంవత్సరాలు దాటినా వారికి, చివరిగా 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మొదట 5 లక్షల డోసులు, ఆ తర్వాత 10 లక్షలు, అనంతరం కోటి డోసులు రాష్ట్రానికి రానున్నాయి. ఇక, వాక్సిన్ వచ్చిన 48 గంటల లోపే అందుబాటులో ఉన్న వైద్య సిబ్బందికి టీకా ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.