ఆత్మహత్యా యత్నం చేసిన తల్లి బిడ్డలను రక్షించిన పోలీసులు

కరీంనగర్: ఓ వివాహిత (25) తన 9 నెలల పసి బిడ్డ తో కలిసి ఎల్ఎండి రిజర్వాయర్ నీటి లో ఆత్మహత్యాయత్నం చేస్తుండగా లేక్ అవుట్ పోస్ట్ పోలీసులు రక్షించారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జీవనోపాధి కోసం కరీంనగర్ లోని కిసాన్ నగర్ లో నివాసం ఉంటున్న వివాహిత మారుపాక స్వప్న (25) ను భర్త రాజు అదనపు కట్నం కోసం తరచూ మానసికంగా వేధిస్తూ, శారీరకంగా హింసిస్తున్నాడు.కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఆమె భర్త ఆదివారం ఉదయం కూడా ఆమెను శారీరకంగా హింసించాడు. దీంతో ఆమె తన 09నెలల పసిబిడ్డతో సహా ఎల్ యండి రిజర్వాయర్ సమీపంలోకి వచ్చి ఆత్మహత్యాయత్నం చేస్తుండగా పోలీస్ కానిస్టేబుల్ మహేశ్వర్, హోం గార్డ్ అన్వర్ అడ్డుకుని వివరాలు ఆరా తీశారు. వెంటనే ఎస్ఐ శ్రీనాథ్ కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను కౌన్సెలింగ్ నిర్వహించారు. త్రీటౌన్ పోలీసులకు సమాచారం అందించి ఆత్మహత్యాయత్నం చేసుకోబోయిన వివాహిత(25),ఆమె 09 నెలల పసి బిడ్డను అప్పగించారు.
ఆత్మహత్యాయత్నం చేసుకోబోయిన వివాహిత, తొమ్మిది నెలల పసిబిడ్డను రక్షించిన కానిస్టేబుల్ మహేశ్వర్, హోంగార్డు అన్వర్, ఎస్ఐ శ్రీనాథ్ లను కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి అభినందిస్తూ రివార్డులను ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.