ఆ దేశంలో మూడోసారి లాక్డౌన్
జెరుసలెం: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో లాక్డౌన్ విధించాయి. తాజాగా ఇజ్రాయెల్లో మూడోసారి లాక్డౌన్ విధించారు. కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో దేశవ్యాప్తంగా మరోసారి కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించినట్లు మూడు రోజుల కిందట ప్రధాని బెంజమిన్ నేతన్యాహు ప్రకటించారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ లాక్డౌన్ అమల్లోకి రానుంది. ఎవరైనా సరే తమ ఇంటికి 1000 మీటర్లలోపు పరిధిలోనే ఉండాలన్న నిబంధన విధించారు. అయితే స్కూళ్లు మాత్రం యథావిధిగా నడిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం గమనార్హం. మరోవైపు నెల రోజుల్లోపే తొలి దశలో భాగంగా 22.5 లక్షల మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు కూడా ప్రధాని నేతన్యాహు ప్రకటించారు. తమ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఓ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించే వేగంతో వెళ్తున్నట్లు ఆయన చెప్పారు.