ఉపకార వేతనాలు, బోధనా రుసుముల దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్: ఉపకార వేతనాలు, బోధనా రుసుముల దరఖాస్తు గడువు పెంచుతూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. 2020-21 విద్యాసంవత్సరానికి గాను గతేడాది 14 అక్టోబర్ నుంచి ఇవాళ్టి (15-2-2021) వరకు ప్రభుత్వం ఈ-పాస్ వెబ్సైట్ను అందుబాటులో ఉంచింది. స్కాలర్షిప్లు, రెన్యూవల్ కోసం దాదాపు 5 లక్షల 11 వేల మంది దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఇంకా చాలామంది విద్యార్థులు చేసుకోలేదు. దాంతో ఈ-పాస్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 31 వరకు గడువు పొడిగించింది.
కొవిడ్ నేపథ్యంలో విద్యాసంవత్సరం ఆలస్యమైనందున వివిధ కోర్సుల్లో ప్రవేశాలు ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఈ-పాస్ వెబ్సైట్ను మార్చి 31 వరకు అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.