ఎపిలో కొత్త జిల్లాలు: 4 సబ్ కమిటీలు

అమరావతి: జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన కమిటీకి ప్రత్యేక సబ్ కమిటీలు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నాలుగు సబ్ కమిటీలు ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వివిధ అంశాలపై నాలుగు ఉప సంఘాలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల సరిహద్దుల నియంత్రణ, న్యాయ వ్యవహారాల అధ్యయనం బాధ్యతను మొదటి సబ్ కమిటీకి అప్పగించారు. సిబ్బంది పునర్విభజన అధ్యయన బాధ్యతలు రెండో ఉప సంఘం చూడనుంది. మూడో సబ్ కమిటీకి ఆస్తులు, మౌలిక సదుపాయాల అధ్యయనం విధులు అప్పగించారు. సాంకేతిక సంబంధిత అధ్యయనాన్ని నాలుగో సబ్ కమిటీకి కేటాయించారు. రాష్ట్ర స్థాయి కమిటీ, సబ్ కమిటీలకు సహాయం కోసం జిల్లా స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఛైర్మన్గా పది మంది సభ్యులతో జిల్లా స్థాయి కమిటీ ఉంటుంది. రాష్ట్ర స్థాయి కమిటీకి ప్రత్యేక సచివాలయం ఏర్పాటు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో జిల్లాల పునర్విభజనపై అధ్యయనం చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్ర స్థాయి కమిటీ, సబ్ కమిటీలకు సహాయం కోసం జిల్లాస్థాయి కమిటీలు, రాష్ట్రస్థాయి కమిటీకి సహాయంగా ఉండేందుకు సచివాలయం ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా కలెక్టర్ ఛైర్మన్గా 10 మంది సభ్యులతో జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటుకానుంది. ఏపీసీఎఫ్ఎస్ఎస్ సీఈవో అధ్యక్షతన రాష్ట్రస్థాయి కమిటీకి సహాయంగా ఉండేందుకు సచివాలయం ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.