ఎస్సైలుగా ఎంపికైన ఎల్లారెడ్డి ముద్దు బిడ్డలు

కామారెడ్డి: కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణం నుండి నగులూరి సాయి, నందికొండ సరళలు. ఇద్దరూ సబ్ ఇన్స్పెక్టర్ లుగా ఎన్నికై ఏడాది పాటు తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకొన్నారు. ఈ రోజు (శుక్రవారం) హైదరాబాదులో విధుల్లో చేరనున్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించి అకుంఠిత దీక్షతో తర్ఫీదు పొంది లక్ష్యాన్ని సాధించారు. ఎల్లారెడ్డి నుండి ఇరువురు ఎస్సైలుగా ఎంపికై ఔరా అనిపించారు.
ఎల్లారెడ్డి పట్టణం నుండి సరళ మొదటి మహిళా ఎస్ఐగా ఎంపికై విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకొని హైదరాబాదులో విధుల్లో చేరనున్నారు. సరళ ఇప్పటివరకే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం కొసమెరుపు. అదేవిధంగా సాయి కృష్ణ కానిస్టేబుల్ గా కామారెడ్డి లో విధులు నిర్వహిస్తూ ఎస్సైగా ఎంపికయ్యారు. వీరిరువు ఈ రోజు హైదరాబాదులో విధుల్లో చేరనున్నారు. కాగా పట్టణం నుండి సబ్ ఇన్స్పెక్టర్ లు గా ఎన్నిక కావడంతో వారి కుటుంబ సభ్యులు, పట్టణ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇరువురిని మీడియా ప్రశ్నించగా.. పోలీసు ఇన్స్పెక్టర్ కావడం వారి కల అని.. దానిని నెరవేర్చుకొనేందుకు ఎంతో శ్రమించినట్లు తెలిపారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రయత్నిస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరగలమని తెలిపారు.
ఇద్దరు కూడా వృత్తినే దైవంగా భావిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి తమ సేవలు అందిస్తామని తెలిపారు. కాగా పట్టణం నుండి ఇరువురు ఎస్సైలుగా ఒకేసారి ఎంపిక కాబడం ఊహించని విషయమని.. కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీలేదని వీరు నిరూపించారని ఎల్లారెడ్డి వాసులు గర్వంగా చెబుతున్నారు.