ఏపీలో దేవాలయాలకు జియో ట్యాగింగ్: డీజీపీ సవాంగ్

అమరావతి: ఇటీవల ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకు సంబంధించిన వరుస ఘటనల దృష్ట్యా రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ రాష్ట్ర పోలీసు శాఖతో పాటు అన్ని శాఖలను అప్రమత్తం చేశారు. ఇందులో భాగంగా దేవాలయాలు, ప్రార్థనా మందిరాల దగ్గర నిరంతర నిఘా కొనసాగుతుందని డీజీపీ సవాంగ్ ప్రకటించారు. పోలీసుశాఖతోపాటు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. భద్రతా చర్యలను పర్యవేక్షించాలని జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క దేవాలయానికి జియో ట్యాగింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. మత సామరస్యానికి ప్రతీకైన ఎపిలో కొంత మందిఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెడుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిజిపి గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు.