ఒకే కుటుంబంలో నలుగురు చిన్నారుల మృతి
స్నానానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు: నారాయణపేట జిల్లాలో విషాదం

దామరగిద్ద: నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో స్నానానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన దామరగిద్ద మండలం మొల్లమాడక గ్రామ పంచాయతీ పరిధిలోని నంద్యా నాయక్ తండాలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే… నంద్యానాయక్ తండాకు చెందిన ఓ వృద్ధుడు గురువారం హైదరాబాద్లో మృతి చెందాడు. మృతదేహాన్ని తీసుకువచ్చిన కుటుంబీకులు శుక్రవారం నంద్యా నాయక్ తండాలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ సంస్కారాలు పూర్తయిన అనంతరం మృతుడి మనువళ్లైన ఐదుగురు చిన్నారులు స్నానం చేసేందుకు సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. చెరువులోకి దిగిన నలుగురు చిన్నారులు ఈత రాక ఒకరి తర్వాత ఒకరు నీట మునిగారు. వీరితో వెళ్లిన మరో బాలుడు విషయాన్ని కుటుంభ సభ్యులకు తెలియజేశాడు. వారు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టగా అప్పటికే చిన్నారులు మృతి చెందారు. మృతులను అర్జున్ నాయక్(13), అరుణ్ నాయక్ (11), గణేశ్ నాయక్ (12), ప్రవీణ్ నాయక్ (12) గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు.