కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ ధర్మెగౌడ ఆత్మహత్య

బెంగళూరు : కర్ణాటక శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌, జెడిఎస్‌ ఎమ్మెల్సీ ధర్మె గౌడ ఆత్మహత్య చేసుకున్నారు. చిక్‌మంగుళూరు జిల్లా కదుర్‌ తాలూకా గుణసాగర్‌ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఆయన మృతదేహం లభ్యమైంది. సోమవారం సాయంత్రం ధర్మెగౌడ ఇంటి నుండి వెళ్లిపోయారు. ఎమ్మెల్సీ గన్‌మెన్‌, పోలీసులు ఆయన కోసం గాలించారు. మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. డిసెంబర్‌ 15న కర్ణాటక విధాన పరిషత్‌ (మండలి) సమావేశాల్లో రసాభాస జరిగిన సంగతి తెలిసిందే. చైర్మన్‌ కె.ప్రతాపచంద్ర శెట్టి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకరినొకరు తోసుకున్నారు. అదే సమయంలో చైర్మన్‌ స్థానంలో ఉన్న ధర్మెగౌడను కాంగ్రెస్‌ సభ్యులు చైర్మన్‌ సీటు నుండి కిందకి లాగారు. కాంగ్రెస్‌ నేత, ఎగువ సభ చైర్మన్‌ ప్రతాప్‌ చంద్ర శెట్టిని రాజ్యాంగ విరుద్ధంగా తొలగించేందుకు అధికార బిజెపితో ధర్మెగౌడ చేతులు కలిపారంటూ కాంగ్రెస్‌ ఆరోపించింది. కాగా, ఆయన మరణంతో రాజకీయాల్లో పెనుదుమారం చెలరేగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ధర్మెగౌడ సోదరుడు ఎస్‌ఎల్‌ భోజ్‌ గౌడ కూడా ఎమ్మెల్సీ. మాజీ కర్ణాటక సిఎం హెచ్‌డి.కుమారస్వామి సన్నిహితులు.

Leave A Reply

Your email address will not be published.