కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్ ను ప్రారంభించిన కెటిఆర్
హైదరాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గచ్చిబౌలిలో నిర్మించిన కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ డేటా సెంటర్ను సర్కార్ ఏర్పాటు చేసింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు మహమ్మద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలోని సీసీ కెమెరాల దృశ్యాలను ఇక్కడ నుంచి వీక్షించవచ్చు. ఏకకాలంలో భారీ తెరపై ఐదువేల సీసీ కెమెరాల దృశ్యాలను వీక్షించే అవకాశం ఉంది. 10లక్షల కెమెరాలకు సంబంధించిన దృశ్యాల్ని నెల రోజుల పాటు నిక్షిప్తం చేసేలా భారీ సర్వర్లు ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో 14 మీటర్ల పొడవు, 42 మీటర్ల ఎత్తుతో అర్ధ చంద్రాకారంలో భారీ తెర, దాని పక్కనే రెండు వైపులా 55 అంగుళాల సామర్థ్యం గల మరో నాలుగు టీవీ తెరలు ఏర్పాటు చేశారు.