చిరుత దాడి.. లేగదూడ మృతి
నల్లగొండ: జిల్లాలోని చందంపేట మండలం పోల్యనాయక్ తండాలో చిరుత దాడిలో లేగదూడ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. తండాకు చెందిన రమావత్ పాండ్య తన పశువులను రాత్రి పొలం వద్దగల పాకలో కట్టేశాడు. ఉదయం వెళ్లి చూసేసరికి లేగదూడ మృతిచెంది ఉంది. రైతు సమాచారంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారి రాజేందర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి చిరుత పాదముద్రలను గుర్తించారు. ఆ ప్రాంతంలో చిరుత సంచరించినట్లు నిర్ధారించారు. ఈ వార్తతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రాత్రి వేళ ఒంటరిగా ప్రజలు బయటకి రావద్దని అధికారులు సూచించారు.