చైనాపై `క్వాడ్` చతుర్ముఖ వ్యూహం

న్యూఢిల్లీ: విస్తరణవాదంతో విర్రవీగుతూ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అశాంతిని రాజేస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా చేతులు కలిపాయి. చైనా దూకుడును అడ్డుకొని ఇండో-పసిఫిక్ను స్వేచ్ఛాయుత ప్రాంతంగా నిలిపేందుకు భారత్ సహా నాలుగు ‘క్వాడ్’(క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్) దేశాలు విదేశాంగమంత్రులు మంగళవారం ముఖాముఖి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా.. ఇండో–పసిఫిక్ విధానానికి క్రమంగా మద్దతు పెరుగుతుండటం సంతృప్తికరమైన అంశమన్నారు. ఇక క్వాడ్ సమావేశాల్లో చెప్పుకోదగ్గ పురోగతి సాధిస్తున్నట్లు మైక్ పాంపియో చెప్పారు. ఈ సమావేశంలో ‘క్వాడ్’కూటమికి చెందిన ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు మరిసె పేన్, తొషిమిత్సు మొటెగి పాల్గొన్నారు. క్వాడ్ వైఖరి మూడో దేశం ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉందని చైనా ఆరోపించింది. ఇతరులను వేరుగా ఉంచాలన్న విధానాలకు బదులుగా దేశాల మధ్య, ద్వైపాక్షిక, బహుళ పాక్షిక సహకారం అవసరమని తెలిపింది.
క్వాడ్ ‘నిజమైన భద్రతా చట్రం’ అని అమెరికా పేర్కొంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలోని అన్ని దేశాలకు ఆర్థిక, భద్రతాపరమైన అంశాల్లో తమ చట్టబద్ధ, కీలక ప్రయోజనాలను కాపాడుకోవడానికే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని భారత్ పేర్కొంది. జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న ‘క్వాడ్’ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ వైభవోపేతమైన, బహుళత్వం కలిగిన మన ప్రజాస్వామ్య దేశాలు ఇండో-పసిఫిక్ను స్వేచ్ఛాయుత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కలిసికట్టుగా కృషిచేయాలని పిలుపునిచ్చారు.